Latest Entries »

సకల జనుల సమ్మె కర్తవ్యం ప్రతిఘటన

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో కీలకఘట్టంగా ఈ వారంలో సకల జనుల సమ్మె ప్రారంభం కాబోతున్నది. ఆగస్ట్ మొదటి వారం నుంచీ సాగుతున్న వేరువేరు పోరాట రూపాల కొనసాగింపూ, ఉన్నతీకరణా ఈ సకల జనుల సమ్మె. తెలంగాణ ప్రజల పోరాట శీలాన్నీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్ష బలాన్నీ ప్రదర్శించగల ఉజ్వల ఉద్యమ ఘట్టం ఇది. చరిత్రాత్మక సందర్భం ఇది.

View full article »

ఇరవై ఏళ్ల ప్రపంచీకరణ

ఈభూమి ఆగస్ట్ 2011

ఇది ఒక విష విషాద గాథ. ఇది ఈ దేశం మరోసారి మోసపోయిన జాడ. ఇది మన ప్రియ భారత జనయిత్రి మూలుగులు పీల్చడానికి చెప్పన్నారు దేశాల గద్దలూ రాబందులూ గండభేరుండాలూ కలిసి వాలిన బీభత్స గాథ. మన రాజకీయ పక్షాలన్నీ తోడేళ్లలా నక్కల్లా తమ నిజరూపాలు చూపుకుని జనాలను పీక్కు తినడానికి ఆ రాబందుల వెంట సాగిన హీన గాథ ఇది. 1991 జూలైలో (కచ్చితంగా చెప్పాలంటే జూలై 1న) మొదలైన ఈ గాథకు ఈ జూలైకి ఇరవై సంవత్సరాలు నిండాయి. ఈ ఇరవై సంవత్సరాలలో ప్రతి సంవత్సరమూ ప్రతి మాసమూ ప్రతి వారమూ ప్రతి దినమూ ప్రతి గంటా ప్రతి నిమిషమూ భారత ప్రజల సర్వసత్తాక అధికారం అవమానానికి గురయింది. ప్రజా సంక్షేమ చర్యలకూ, రాజ్యాంగబద్ధ పాలనకూ అయితే అధికారగణానికి పనిగంటలూ, సెలవులూ ఉంటాయి గాని ఈ దేశ వ్యతిరేక, ప్రజావ్యతిరేక చర్యలకు మాత్రం మన ప్రభుత్వం ఓవర్ టైమ్ పనిచేసింది. వారానికి ఏడురోజులూ రోజుకు ఇరవైనాలుగు గంటలూ పనిచేసింది. భారత ప్రజల ప్రజాస్వామిక పాలనా యంత్రాంగం దేశదేశాల ధనస్వామ్యానికి దళారీగా మారి బహుళజాతి సంస్థలు విదిల్చిన ఎంగిలి మెతుకులు ఏరుకు తింది. భారత ప్రజల సామ్యవాద ఆదర్శం, రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు తుంగలో తొక్కబడ్డాయి. లడఖ్ నుంచి లక్షద్వీపాల దాకా, కచ్ నుంచి కోహిమా దాకా ఈ దేశం అక్రమ లాభార్జనాపరుల పదఘట్టనల పొక్కిలి నేల అయింది. ఈ కథ అణువణువూ వివరించాలంటే ఈ రెండు లక్షల గంటలలో ప్రతిగంటా ఏ విధానాలు, చర్యలు, కుట్రలు, అమ్మకాలు, కొనుగోళ్లు, కొల్లగొట్టడాలు, దళారీతనాలు, విధ్వంసాలు, అక్రమార్జనలు, ప్రశ్నించిన ప్రజల మీద దమనకాండలు జరిగాయో రెండులక్షల పేజీలు రాసినా సరిపోదు. ఇక్కడ మచ్చుకు ఒక విహంగావలోకనం మాత్రమే.

View full article »

ప్రజల పాటకు ప్రతిఫలం మరణశిక్ష!

వీక్షణం ఆగస్ట్ 2011

జార్ఖండ్ ప్రజా కళాకారుడు, పదిహేను సంవత్సరాలకు పైగా ఖొత్తా, సంథాలీ, నాగ్ పురి, హిందీ భాషలలో ప్రజా చైతన్య గీతాలు ఆలపిస్తూ తిరుగుతున్న ప్రముఖ గాయకుడు జీతన్ మరాండీకి ఒక అబద్ధపు కేసులో, దొంగ సాక్ష్యాల ఆధారంగా గిరిది న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ఈ కేసు వివరాలు చూస్తే ఈ దేశంలో, ముఖ్యంగా జార్ఖండ్ వంటి పోరాట ప్రాంతాలలో పాలకవర్గాలు ప్రజా ఉద్యమకారుల మీద, ఉద్యమ సమర్థకుల మీద, ప్రచారకుల మీద ఎంత దుర్మార్గమైన దమననీతిని అనుసరిస్తున్నాయో అర్థమవుతుంది. ఒక సాంస్కృతిక సంస్థ నాయకుడిగా, గాయకుడిగా, సాంస్కృతిక కార్యకర్తగా బహిరంగ జీవితంలో ఉన్న వ్యక్తి మీద తప్పుడు సాక్ష్యాలతో హత్యానేరాన్ని ఆరోపించడమే ఒక కుటిలనీతి కాగా, సాక్ష్యాల బోలుతనం స్పష్టంగా బయట పడుతున్నా, బధిరాంధ న్యాయస్థానం మరణ శిక్ష విధించడం మరింత నీచం.

View full article »

సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పులు

వీక్షణం ఆగస్ట్ 2011

 

భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జూలై మొదటివారంలో రెండు చరిత్రాత్మకమైన తీర్పులు ప్రకటించింది. తమముందు సంవత్సరాలుగా విచారణ జరుగుతున్న రెండు కేసులలో జూలై 4న, 5న తీర్పులు వెలువరించిన న్యాయమూర్తులు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సురిందర్ సింగ్ నిజ్జర్ దేశ రాజకీయార్థిక వ్యవస్థ గురించీ, పాలన గురించీ, ప్రపంచీకరణ విధానాల గురించీ, ప్రజా ఉద్యమాల గురించీ చాల ఆలోచనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. విదేశాలకు అక్రమంగా తరలిపోతున్న భారతీయ సంపదను వెనక్కి తేవాలనే కేసులోనూ, చత్తీస్ గడ్ లో సాల్వా జుడుం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రైవేటు సైన్యం అకృత్యాలను అరికట్టాలనే కేసులోనూ ఈ తీర్పులు వెలువడ్డాయి. ప్రజల గురించి, దేశం గురించి, న్యాయం గురించి ఈ తీర్పులు మళ్లీ ఒకసారి మౌలికమైన చర్చను ముందుకు తెచ్చాయి. ఈ దేశంలో అధికార వ్యవస్థలలో, పాలక సంస్థలలో కూడ ఎక్కడో ఒకచోట న్యాయాన్యాయాలు ఆలోచించగల వాళ్లు ఇంకా ఉన్నారని రుజువు చేశాయి.

View full article »

నెల్లూరు గుండెలపై కుంపట్లు

వీక్షణం ఆగస్ట్ 2011

 

నెల్లూరు జిల్లా సముద్రతీరంలోని ముత్తుకూరు మండలంలో, దానికి ఆనుకుని ఉన్న చిల్లకూరు, వెంకటాచలం మండలాలలో ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఇరవై ఆరు థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యుత్ కేంద్రాలలో ప్రైవేటు రంగంలో 25, ప్రభుత్వ రంగంలో ఒకటి రాబోతున్నాయి. వీటిలో కొన్ని ఆగిపోయాయని, మందకొడిగా సాగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం అనుకున్నట్టుగా నిర్మాణం సాగితే, కొద్ది సంవత్సరాలలో ఈ విద్యుత్ కేంద్రాల వల్ల రోజుకు రెండు లక్షల టన్నుల బూడిద, 15 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్, 22,000 టన్నుల గంధకం, వేరువేరు పరిమాణాలలో పాదరసం, ఆర్సెనిక్, కాడ్మియం వంటి అణుధార్మిక, విషపదార్థాలెన్నో వెలువడతాయి. ఎనిమిది గ్రామాలలో నెలకొల్పుతున్న ఈ కేంద్రాల వల్ల చుట్టూ నెల్లూరు జిల్లా సముద్రతీర ప్రాంతమంతా బూడిదకుప్పగా మారిపోతుంది. అక్కడి నీరు, గాలి విషపూరితమై వ్యవసాయానికీ, పళ్లతోటలకూ, చేపల చెరువులకూ, సముద్రం మీద చేపలవేటకూ అవకాశాలు మృగ్యమైపోతాయి. ఏటేటా దూరతీరాల నుంచి వచ్చే పక్షుల విహార కేంద్రాలు వట్టిపోతాయి. అక్కడి ప్రజలందరూ అక్కడే ఉంటే చనిపోవడమో, తీవ్రంగా అనారోగ్యం బారినపడడమో జరుగుతుంది. లేదా ఉన్నఊరూ, ఉపాధీ వదిలిపెట్టి పొట్టచేత పట్టుకుని వలస వెళ్లవలసి వస్తుంది.

View full article »

ఎప్పటికైనా రాజపక్షను శిక్షిస్తారా?

సంపాదకీయ వ్యాఖ్యలు 2

శ్రీలంకలో స్వతంత్ర ఈలం స్థాపించుకోవాలనే తమిళ జాతి ఆకాంక్ష సాయుధపోరాట రూపం తీసుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించి ఇరవై సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగి, అతి భయంకరమైన అణచివేతకు గురై ఓడిపోయి రెండు సంవత్సరాలయింది. 2009 మేలో శ్రీలంక ప్రభుత్వం, భారత ప్రభుత్వ సహాయంతో అతి దుర్మార్గమైన దాడులు జరిపి అత్యంత కిరాతకంగా వేలాది మంది ఎల్ టి టి ఇ సైనికులను, సాధారణ తమిళ ప్రజలను చంపివేసింది. హతుల సంఖ్య నలభై వేల నుంచి లక్ష దాకా ఉండవచ్చని అంచనా.

View full article »

సంపాదకీయ వ్యాఖ్యలు 1

ద్వంద్వాలుగా కనబడేవన్నీ, ద్వంద్వాలుగా చూపబడేవన్నీ ద్వంద్వాలు కావు. ఎదురెదురుగా ఉన్నట్టు, తీవ్రమైన ఘర్షణ పడుతున్నట్టు కనబడుతున్నవన్నీ నిజంగా ప్రత్యర్థి శక్తులు కావు. పాలకవర్గ ముఠాల మధ్య కూడ తమ స్వార్థ ప్రయోజనాల కోసం భీకరమైన ఘర్షణలే జరుగుతాయి. అన్నా హజారే – కపిల్ సిబాల్, బాబా రాందేవ్ – ప్రభుత్వం, యుపిఎ – బిజెపి, అవినీతి – అవినీతి రాహిత్యం అనే ద్వంద్వాలను ఇవాళ పాలకవర్గాలలోని వివిధ ముఠాలు, ఆ ముఠాలకు ప్రాతినిధ్యం వహించే ప్రచారసాధనాలు నిజంగా ఎదురుబొదురుగా నిలబడిన ద్వంద్వాలన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి.

View full article »

ప్రజల పట్ల శ్రద్ధ లేని పాలకులు

వీక్షణం జూలై 2011 సంపాదకీయం

 

తమను తాము ప్రజాస్వామిక అవతారాలమని, అత్యధిక వోట్లు తెచ్చుకున్న ప్రజాప్రతినిధులమని, తమ పనులకన్నిటికీ ప్రజామోదం ఉన్నట్టేనని చెప్పుకుంటున్న పాలకులకు ప్రజల పట్ల కనీస శ్రద్ధ లేదని రోజురోజూ రుజువవుతున్నది. ప్రత్యేకించి రాష్ట్రం సమస్యల సుడిగుండంలో నానాటికీ దిగజారిపోతుండగా, ఈ అగ్నిపర్వతం ఎప్పుడు పేలిపోతుందోననిపించే స్థితి ఉండగా పాలకులకు మాత్రం చీమకుట్టినట్టయినా లేదు. ఏ ఒక్క ప్రజాసమస్యనైనా పరిష్కరిద్దామనే ఆలోచనే పాలకుల దరిజేరడం లేదు. పాత సమస్యలను, ప్రజలు లేవనెత్తుతున్న సమస్యలను పరిష్కరించకపోవడం మాత్రమే కాదు, ప్రజలకు కొత్త సమస్యలను పాలకులే సృష్టిస్తున్నారు. మరొకవైపు ప్రజలకు ఎంతమాత్రం సంబంధంలేని పనికిమాలిన వ్యవహారాలలో, విలాసాలలో, పక్కదారి పట్టించే, ప్రజలకోసమేనని మభ్యపెట్టే కార్యక్రమాలలో మునిగి తేలుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతమూ ఏ ఒక్క ప్రజాసమూహమూ సమస్యలు లేని స్థితిలో లేదు.

View full article »

అదృశ్యమైన ధృవతార ఆర్ ఎస్ రావు

మనకాలపు మహామేధావి, సునిశితమైన మార్క్సిస్టు విశ్లేషకుడు ఆర్ ఎస్ రావు కన్నుమూశారు. ముప్పై సంవత్సరాలుగా ఆయనతో సాగిన అనుబంధంలో కలిసి చేసిన ఆలోచనలు, పనులు, ప్రయాణాలు, కలిసి కన్న కలలు, పొందిన విజయాలు, వైఫల్యాలు అన్నీ ముగింపుకు వచ్చినట్టు గుండె పగిలే మౌనం. మహానిశ్శబ్దం. ‘చలనం మాత్రమే ఉంది. విశ్రాంతి, విరామం లేవు, విశ్రాంతి, విరామాల గురించి ఉన్న తాత్విక ప్రత్యయం కేవలం మన ఆలోచనా సౌలభ్యానికే తప్ప, సాపేక్షికంగానే తప్ప ప్రకృతిలో, సమాజంలో, మానవ మేధలో దానికి అవకాశమే లేదు’ అని ఎప్పుడూ చెపుతుండే ఆయన మేధ విరామానికి చేరింది. బహుశా అది ఆ ఆలోచనలకు విరామం కాదేమో. ఆ చలనం కొనసాగుతూనే ఉంటుందేమో.

నిజంగా ఆయనతో మాట్లాడడం అంటే ఒక చలనం, ఒక చైతన్యం, ఒక వెలుగు. అప్పటిదాకా మనకు తట్టని ప్రశ్నను మన మెదడులో ప్రవేశపెట్టి అల్లకల్లోలం చేసేవారాయన. ఇక ఇది అంతిమ నిర్ణయం, ఆలోచించవలసిందేమీ లేదు అనుకున్న దాని మీద కందిరీగల తుట్టెను రేపేవారాయన. అప్పటిదాకా ఎన్నో వైపుల ఆలోచించిన విషయానికే మరొక కొత్త కోణాన్ని చూపెట్టేవారాయన. గ్రామీణ వ్యవసాయ సమాజంలో చీకటి రాత్రి దిక్కు చూపడానికి ప్రతి మనిషీ వాడుకునే ధృవనక్షత్రం లాంటి వారాయన. ముసిముసి చీకటి తొలగిపోకముందే వెలుగుదారి పరిచే వేగుచుక్క ఆయన. తెలుగు సమాజమూ, భారత విప్లవోద్యమమూ అతి కీలక దశలో ఉన్నప్పుడు, ఎన్నెన్నో కొత్త, సంక్లిష్ట సమస్యలకు జవాబులు వెతకవలసిన తరుణంలో ఆ ధృవతార అదృశ్యమయింది.

View full article »

ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను గనుక ఈ తప్పటడుగుల్ని పెద్దమనసుతో క్షమించండి. కొంతకాలం ఇవ్వండి.

Follow

Get every new post delivered to your Inbox.