అసలు నీటి కోసమేనా ఈ వివాదాలు?

నవ తెలంగాణ దినపత్రిక ఆగస్ట్ 4, 2021 కోసం – తెలంగాణార్థం

కొద్ది నెలలుగా జల వివాదాలు అనే పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీచులాటలు, ఖండన మండనలు జరుగుతున్నాయి. శ్ర్రీశైలం రిజర్వాయర్ నుంచి మూడు టిఎంసి ల నీటిని రాయలసీమకు తీసుకుపోయే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే మొదటి వారంలో అధికారిక అనుమతులు ఇవ్వడంతో అంతకు ముందరి చిటపటలు మంటలుగా రగుల్కొన్నాయి. నీరు నిప్పై మండడం ప్రారంభమైంది. దానికి ప్రతిగా తెలంగాణ కాబినెట్ జూన్ లో కృష్ణా నదీ జలాల వినియోగానికి ఆరు పథకాలను ఆమోదించింది. జూలైలో కృష్ణా నదీజలాల నిర్వహణ బోర్డు అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో జల విద్యుదుత్పాదన చేస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది.

ఇలా ఈ ఘర్షణ పోతిరెడ్డిపాడు, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రాజెక్టుల యాజమాన్య పరిధి, ఆలంపూర్ బారేజి, వరదకాలువ, నాగార్జునసాగర్ టేల్ పాండ్ ఎత్తిపోతల పథకం వంటి ప్రతిపాదనలు, కృష్ణా మిగులు జలాలు, నికరజలాలు, పాత పంపిణీలలో అసమానతలు, కొత్త పంపిణీ జరగవలసిన అవసరం వంటి అనేక సంబంధిత అంశాల చుట్టూ తిరుగుతూ చినికి చినికి గాలివాన అయింది. ఇంతలోనే పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టు కేంద్ర ప్రభుత్వం (నిజానికి దాన్ని కేంద్ర ప్రభుత్వం అనడం తప్పనీ, సమాఖ్య ప్రభుత్వం అనాలనీ అంటున్న తమిళ సోదరుల నుంచి మనమింకా నేర్చుకోవలసే ఉంది) అన్ని హక్కులనూ కృష్ణా, గోదావరీ జలాల బోర్డులకు అప్పగిస్తూ దుర్మార్గమైన గెజెట్ నోటిఫికేషన్ ప్రకటించింది. ఆ ఢిల్లీ సర్కారు దుర్మార్గం అతి వేగంగా ముందుకు సాగుతూ ఉండగానే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ తమ మీదికి వస్తున్న ఉత్పాతాన్ని పట్టించుకోనట్టు తమలో తాము కీచులాడుకుంటున్నాయి. దాదాగిరీ అనీ, దౌర్జన్యం అనీ, మోసం అనీ, కొల్లగొట్టడం అనీ ఒకరి మీద ఒకరు దుర్భాషలాడుకుంటున్నారు.

రెండువైపులా సామరస్యంగా ఆలోచించలేని, ఉద్రేకాలు పెరిగిన ఈ నేపథ్యంలో చరిత్ర తవ్వి ఎవరి తప్పు ఎంత నిర్ధారించడం అసాధ్యమవుతుంది. కాని గుర్తించవలసిన విషయమేమంటే రెండు వైపులా పాలకుల దృష్టి నీటి మీద మాత్రమే లేదు. రెండు వైపులా నీరు ఒక సాకు మాత్రమే. రెండు ప్రాంతాల పాలకులూ నీటిని సెంటిమెంటుగా వాడుకుంటున్నారు. ప్రజల భావోద్వేగాల్ని రెచ్చగొట్టే దినుసుగా మాత్రమే చూస్తున్నారు. జలవివాదాన్ని వోటు బ్యాంక్ ను బలోపేతం చేసుకునే, స్థిరపరచుకునే సాధనంగా చూస్తున్నారు. న్యాయాన్యాయాల జోలికి, చట్టబద్ధత చట్టవ్యతిరేకత జోలికి పోకుండా ఎవరు ఎంత ఎక్కువ బిగ్గరగా అరిస్తే, ఎవరు అవతలివాళ్ల మీద ఎంత ఎక్కువ అభాండాలు వేస్తే అంత ఎక్కువగా తమ ప్రాంతంలోని ప్రజలను ఆకర్షించగలమని అనుకుంటున్నారు.

ఇటువంటి వాతావరణంలో చరిత్ర, వాస్తవాలు, న్యాయభావన, ప్రజాప్రయోజనాలు వంటివన్నీ గాలికి, కాదు నీళ్లలో, కొట్టుకు పోతున్నాయి. అంతకన్న ముఖ్యంగా ఏ స్థానిక, ప్రాంతీయ హక్కు కోసం ఇరు పక్షాలూ ఇంత ఘర్షణకు దిగుతున్నాయో, ఆ స్థానికత, ప్రాంతీయత ధ్వంసమై, మొత్తంగా ఎటువంటి హక్కూ అధికారమూ లేని సమాఖ్య ప్రభుత్వ జోక్యం పెరుగుతున్నది. ఇప్పుడిది సుప్రీంకోర్టుకు కూడ చేరి, అస్సాం-మిజోరాం రాష్ట్రాల మధ్య హింసాయుతంగా మారిన ఘర్షణ ప్రస్తావన కూడ వచ్చింది. అంటే మొత్తం మీద నదీ జలాల పంపిణీ సమస్యను తమ మధ్య సామరస్యంగా పరిష్కరించుకోవలసిన రెండు పరీవాహక రాష్ట్రాల పాలకులు తమ రాజకీయ, తాత్కాలిక ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. అనవసరమైన వివాదానికి కాలు దువ్వుతున్నారు.

ఎక్కువగా సాంకేతిక అంశాలలోకి పోకుండానే, ఈ వివాదానికి మూలాలు చరిత్రలోనే ఉన్నాయని గుర్తించవలసి ఉంది. పశ్చిమ కనుమలలో పుట్టిన కృష్ణా నది మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు దాటి తెలంగాణలో ప్రవేశిస్తుంది. పద్నాలుగు వందల కి.మీ. పొడవైన ఈ నదిలో సాలీనా 2,060 టిఎంసిల నీరు (75 శాతం లభ్యతతో) ఉంటుందని కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ (బచావత్ ట్రైబ్యునల్) అంచనావేసింది. ఆ ట్రైబ్యునల్ అవార్డ్ ప్రకారం అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి 811 టిఎంసిలు దక్కాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణానది తెలంగాణలో 68.5 శాతం ప్రవహిస్తుండగా, నీటి వాడకం మాత్రం 19.7 శాతం ఉండేలా ప్రాజెక్టుల రూపకల్పన, నిర్మాణం జరిగాయి. కృష్ణా జలాల మీద న్యాయంగా హక్కు ఉండే పరీవాహక ప్రాంతాలైన మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల సాగునీటి, తాగునీటి ప్రయోజనాలు నెరవేరవలసినంతగా నెరవేరలేదు. కృష్ణానదీ జలాల వినియోగదారులలో దిగువన ఉన్న రెండు మూడు జిల్లాల రెండు పంటల, మూడు పంటల ప్రయోజనం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎగువ జిల్లాల ప్రజల పొలాలూ గొంతులూ ఎండబెట్టాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరులూదిన అసంతృప్తులలో అది ఒకటి.

అలా ఉమ్మడి రాష్ట్రానికి దక్కిన వాటాను న్యాయబద్ధంగా పంపిణీ చేయకపోవడం ఒక అంశమైతే, అసలు కొన్ని సంవత్సరాలు వందల టిఎంసిల నీరు వృథాగా సముద్రంలోకి ప్రవహిస్తుండగా, కొన్ని సంవత్సరాలు వాటాకు తగిన నీరు కూడ రాని పరిస్థితి ఉండేది. నిజానికి కృష్ణా జలాల లభ్యత 2,060 టిఎంసిలు అనేది సరైన అంచనా కాదని, అంత నీరు లభ్యమయ్యే సంవత్సరాలు అతి తక్కువ అని, ఆ మొత్తం లభ్యతను వాస్తవికంగా, అంటే తక్కువగా నిర్ధారించి ఆమేరకే వాటాలు కేటాయించవలసి ఉండిందని రాసిన జల నిపుణులు కూడ ఉన్నారు. ఈ నికర జలాలు కాక, ఉంటాయో ఉండవో తెలియని మిగులు జలాల మీద హక్కు ఎవరిదనే వివాదం ఉండనే ఉంది.

బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను, పంపిణీని పునఃపరిశీలించవలసి ఉందనే ఆకాంక్ష, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలో మిళితమైంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఈ జల వివాదాల పరిష్కార బాధ్యతను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న బోర్డులకు అప్పగించింది. అప్పటికి ఐదు సంవత్సరాల కింద ఏర్పడిన బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ దీర్ఘకాలిక పరిష్కారం కోసం చర్చలు, సంప్రదింపులు జరపవలసి ఉందని, ఈ లోగా తాత్కాలిక కేటాయింపుగా 2015లో అప్పటికి ఉన్న 811 టిఎంసిల నీటినే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య 66:34 నిష్పత్తితో పంపిణీ చేసింది. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ కు 512 టిఎంసిలు, తెలంగాణకు 299 టిఎంసిలు దక్కాయి. ఈ అసమాన పంపిణీలోనే అన్యాయం ఉంది. నిజానికి అప్పటివరకూ ఉమ్మడి రాష్ట్రంలో తమ నీటి వాటా తమకు దక్కలేదని, అన్యాయం జరిగిందని వాదిస్తూ వచ్చిన తెలంగాణ ఉద్యమ నాయకులు పాలకులు కాగానే ఈ అసమాన పంపిణీని పేరుకు సుప్రీం కోర్టులో సవాలు చేసినప్పటికీ, వాస్తవంగా అంగీకరించారు. ఒకరకంగా అప్పటివరకూ జరిగిన అన్యాయాలను స్థిరీకరించారు. బహుశా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి అవకాశం ఉండే ఈ అసమానతను యథాతథంగా ఉంచడమే భవిష్యత్తులో తమకు ఉపయోగపడుతుందని అనుకున్నారేమో తెలియదు. నిజానికి ప్రస్తుత వివాదంలోని దాదాపు అన్ని అంశాలకూ మూలాలు 2014 ముందరి చరిత్రలో ఉండగా, ఆ అంశాలను 2015 అసమాన పంపిణీ స్థిరీకరించింది.

ఈ స్థితిలో ప్రధానంగా మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల సాగునీటి, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కృష్ణా నదీ జలాలను పునఃపంపిణీ చేయాలని, కృష్ణా నదీజలాల నిర్వహణ బోర్డు పనితీరు సమన్వయపూరితంగా, ప్రజాస్వామికంగా, పారదర్శకంగా ఉండాలని వాదించవలసిన తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేయలేదు. బేసిన్ లో ఉన్నదా లేదా అనే ప్రశ్నతో సంబంధం లేకుండా కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమ సాగునీటి, తాగునీటి అవసరాల కోసం, కృష్ణా, గుంటూరు ప్రయోజనాలు తగ్గించి అయినా కృష్ణా జలాలు అందించవలసి ఉంటుందని, అందుకు ఎగువ రాష్ట్రాల నుంచి రాదగిన అభ్యంతరాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకోలేదు.

ఇటు తెలంగాణ ప్రభుత్వం నీటిని ఇంకా ఇంకా ఎక్కువగా సెంటిమెంటుగా మార్చడమెట్లా, నీరు కోరే ప్రజలకు ఎండమావులు చూపుతూ తన వెనుక ఉంచుకోవడమెట్లా, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షకురాలిని తాను మాత్రమేననిపించే రాజకీయ క్రీడలో పావులు కదపడం ఎట్లా, సమస్య వచ్చినప్పుడల్లా తెలంగాణ తెలంగాణ అని ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టే వీలు ఉంచుకోవడం ఎట్లా అని మాత్రమే ఆలోచిస్తూ వచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్ పాలకులు పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయార్థిక విధానాలనూ, రాయలసీమ పట్ల వివక్షనూ అట్లాగే కొనసాగిస్తూ, మాటల్లో మాత్రం రాయలసీమకు ఏదో ఒరగబెడుతున్నట్టు నటించే కళను యథాతథంగా కొనసాగించారు. అంతకు ముందరి ఉమ్మడి ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం లాగనే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడ కేంద్ర జల సంఘం, నదీజల బోర్డులు, పర్యావరణ సంస్థలు ఇవ్వవలసిన అనుమతులు, ఆర్థిక అనుమతులు లేకుండానే ప్రజలను మాయ చేయడానికి ప్రాజెక్టులు ప్రకటించడం, కాంట్రాక్టర్లను మేపడానికి నిధులు విడుదల చేయడం, ప్రతి పనీ వివాదంలో చిక్కుకుని ముందుకు కదలకపోవడం అనే క్రమాన్ని కొనసాగించారు.

అయితే ప్రస్తుత సమస్య రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ కాదు, జలవివాదాలూ కాదు, అంతకన్న తీవ్రమైన సమస్య రెండు రాష్ట్రాలకూ ఎదురైంది. అది రెండు రాష్ట్రాలలోని అన్ని భారీ, మధ్యతరహా నీటి ప్రాజెక్టులను కృష్ణా, గోదావరీ నదీజల నిర్వహణ బోర్డులకు అప్పగిస్తూ సమాఖ్య ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు.  సమాఖ్య ప్రభుత్వపు జలశక్తి మంత్రిత్వ శాఖ జూలై 15న జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం నీటి విడుదల, నీటి పారుదల, జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతించడం వంటి పనులన్నిటి మీద ఈ బోర్డులకే అధికారం ఉంటుంది. రెండు రాష్ట్రాలూ ఇప్పటికి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నిటినీ తక్షణమే ఆపవలసి ఉంటుంది.

హిందీలోనూ, ఇంగ్లిష్ లోనూ కలిసి డెబ్బై పేజీలు ఉన్న ఈ గెజెట్ నోటిఫికేషన్ ఎంత అప్రజాస్వామికంగా, సమాఖ్యభావనకు విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను ఉల్లంఘిస్తూ తయారయిందో వివరంగా చర్చించవలసి ఉంది. ఎచ్ అనే ఒకే ఒక్క నిబంధన చూస్తేనే ఇవి ఎంత దుర్మార్గమైన ఉత్తర్వులో అర్థమవుతుంది. కృష్ణా నదీజల నిర్వహణ బోర్డులో “ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని చైర్మన్ గా గాని, సభ్య కార్యదర్శిగా గాని, సభ్యులుగా గాని, చీఫ్ ఇంజనీర్లుగా గాని నియమించడానికి వీలులేదు” అని ఆ నిబంధన చెపుతుంది. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన వారెవరూ ఈ రెండు రాష్ట్రాల గురించి జరిగే చర్చలో భాగం కావడానికి వీలు లేదనడం సంఘ్ పరివార్ గుత్తాధిపత్య రాజకీయాలకు నిదర్శనం. కశ్మీరీల భవిష్యత్తు గురించి జరిగే చర్చలలో భారత ప్రభుత్వంతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు కూడ భాగం పంచుకోవచ్చు గాని కశ్మీరీలకు మాత్రం స్థానం లేదని చెప్పే భారత పాలకవర్గాల దృక్పథం అది.

నిజానికి ఇది భారత అధికార వ్యవస్థలో అలవాటైన పద్ధతి కూడ కాదు, పంజాబ్, హర్యానాల మధ్య, తమిళనాడు కర్నాటకల మధ్య, తుంగభద్ర పరీవాహక రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు వచ్చినప్పుడూ, అంతకుముందూ రూపొందించిన మధ్యవర్తి యంత్రాంగాలలో తప్పనిసరిగా ఆ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు ఆ పద్ధతి ఎందుకు వదిలేస్తున్నారో వివరణ లేదు. జలవివాదాలు పరిష్కరించడానికి ఢిల్లీయో సుప్రీంకోర్టో జోక్యం చేసుకోవాలని కోరుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ అప్పుడు ఆ ఆకాంక్షను ఎందుకు వ్యక్తం చేసిందో గాని, ఇప్పుడు ఢిల్లీ బొటనవేలు పెత్తనం కింద నలిగిపోక తప్పదు.

ఇప్పటికైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ సమస్యను తమ మధ్యనే పరిష్కరించుకోవాలనీ, దానికన్న ముఖ్యంగా ఈ ప్రజా సమస్యను తమ రాజకీయ, తాత్కాలిక అవసరాల కోసం ఉపయోగించుకోగూడదనీ అనుకోవలసి ఉంది. అవి అలా అనుకునేలా ఒత్తిడి తేవలసింది ప్రజలే.   

  • ఎన్ వేణుగోపాల్

ఆగస్ట్ 3, 2021

Posted in Telugu | Leave a comment

మహాప్రస్థానం మహాప్రచురణ – ఒక ఉత్సవ సందర్భం

శ్రీశ్రీ విశ్వేశ్వరరావు ఆలోచనాచరణతో వెలువడిన మహాప్రస్థానం మహా ప్రచురణ నిజంగా తెలుగు సమాజమూ సాహిత్యలోకమూ జరుపుకోవలసిన ఒక ఉజ్వల ఉత్సవ సందర్భం. నిన్న ఉదయం ఆ పుస్తకం నా చేతికి అందగానే నా సంతోషం మీతో పంచుకున్నాను. నిన్నంతా ఆ పుస్తకంతోనే గడిచింది. ఇవాళ విశ్వేశ్వరరావు గారిని కలిశాను. మహాప్రస్థానం మహా ప్రతిలో ప్రతి పేజీనీ శ్రద్ధగా, ప్రేమగా, గొప్ప కళా హృదయంతో, సాంకేతిక నైపుణ్యంతో అలంకరించిన అరసవల్లి గిరిధర్ గారిని కలిశాను. వాళ్లిద్దరూ సాధించిన అద్భుతానికి ప్రశంస ఏ రూపంలో ఇచ్చినా సరిపోదు గాని ఉద్వేగభరితమైన కంటి తడితో, ప్రేమపూర్వక ఆలింగనంతో నా ధన్యవాదాలు చెప్పుకున్నాను.

నిన్న పుస్తకంతో నా ఫోటో, పోస్ట్ మీద వ్యాఖ్యానిస్తూ మిత్రులు కన్నెగంటి రామారావు గారు “మీకు ఈ పుస్తకం ఇంకా అర్థవంతం. ఇప్పటికీ, కవితా ఓ కవితా మద్దిపాటి గారింట్లో మీరు చెప్పడం గుర్తుంది” అని రాసి, జ్ఞాపకాల గని తవ్వకానికి పురికొల్పారు. పదమూడు సంవత్సరాల కింద 2008 జూన్ రెండో వారంలో నేనూ వనజా డెట్రాయిట్ లో మిత్రులు ఆనంద్ – శారదల ఇంట్లో ఉన్నప్పుడు, జూన్ 13 సాయంత్రం మిత్రులు మద్దిపాటి కృష్ణారావు గారి ఇంట్లో ఆరి సీతారామయ్య గారు, కన్నెగంటి రామారావు గారు వంటి డెట్రాయిట్ మిత్రులందరూ కలిశారు. అక్కడ నేను ఒకటి రెండు నా కవితలు చదివి, ఆ తర్వాత శ్రీశ్రీ ‘కవితా ఓ కవితా’ చదువుతుంటే కృష్ణారావు గారు రికార్డ్ చేశారు.

మహాప్రస్థానం గురించి తెలుగు పాఠకులకు, సాహిత్యాభిమానులకు కొత్తగా చెప్పవలసిందేమీ లేదు. గత ఏడు దశాబ్దాలలో అది పుస్తకంగానే కనీసం లక్ష ప్రతులు అచ్చయి ఉంటుంది. అందులో కవితలు విడివిడిగా కవితా సంకలనాలలో, పాఠ్యపుస్తకాలలో, సినిమాలలో, నాటకాలలో, వక్తల ఉపన్యాసాలలో, వేదికల మీద పఠనాలలో లక్షలసార్లు పునరుక్తమై ఉంటాయి. మహాప్రస్థానం మాత్రమే కాక, ఖడ్గసృష్టి, సిప్రాలి, మరోప్రస్థానం, కథలు, నాటకాలు, అనంతం ఎన్నోసార్లు ప్రచురణ అయ్యాయి. ఆయన సమగ్ర రచనలు ఇప్పటికీ కనీసం మూడు ప్రచురణాల్లో వెలువడ్డాయి. మొత్తంగా శ్రీశ్రీ సాహిత్యం మీద, ప్రత్యేకించి మహాప్రస్థానం మీద ఇతరుల రచనలు, వివరణలు, వ్యాఖ్యానాలు నూటయాబై పుస్తకాలైనా వెలువడి ఉండవచ్చు. సింగంపల్లి అశోక్ కుమార్ గారి శ్రీశ్రీ సాహిత్య నిధి ఒక్కటే శ్రీశ్రీ మీద వంద పుస్తకాలు ప్రచురించింది.

అయినా శ్రీశ్రీ మీద తెలుగు సమాజ సాహిత్యాల ఆసక్తి తరగలేదు. తెలుగు సమాజ సాహిత్యాలకు శ్రీశ్రీ అవసరం తీరలేదు. కాఫీ టేబుల్ బుక్ అనే మహా ప్రచురణ చదవడానికి అంత సౌకర్యవంతం కాకపోవచ్చు. అది ఒక గౌరవ ప్రకటన. ఒక ఆత్మీయ సంస్మరణ. ఒక విలువైన స్మరణిక. జాబిల్లిని తలచుకుంటే మనసు వెర్రెత్తి ఇదివరకెవరో అన్నదే, ఇంకా బాగా అన్నదే మళ్లీ వల్లిస్తానని శ్రీశ్రీ అన్నట్టు గానే, మహా ప్రస్థానం మహా ప్రచురణ శ్రీశ్రీ మాటలే వాడుకుని చెప్పాలంటే ‘ఒక చాలా సున్నితమైన పువ్వు, చాలా వాడైన కత్తి, విలువైన వజ్రం.’ ఈ పువ్వు వికసిస్తున్న, ఈ కత్తి దూస్తున్న, ఈ వజ్రం వెలుగులు చిమ్ముతున్న ఈ సందర్భం నిజంగా ఉత్సవం చేసుకోవలసిన సమయం.               

Posted in Telugu | Leave a comment

హంతక అసహనం – దభోల్కర్ నుంచి రోహిత్ దాకా

Rohith

సంఘ్ పరివార్ ఫాసిజానికీ, హంతక అసహనానికీ మరొక స్వతంత్ర ఆలోచనాపరుడు బలయ్యాడు. సంఘ్ పరివార్ లో భాగమైన భారతీయ జనతా పార్టీ, అందులోనూ గుజరాత్ నరమేధపు నెత్తురంటిన చేతుల నరేంద్ర మోడీ, కేంద్రంలో అధికారానికి వచ్చిన తర్వాత పెట్రేగి పోతున్న హిందూ మతోన్మాద శక్తుల దాడులలో బలి అయిపోయిన జాబితాలో మరొక పేరుగా రోహిత్ వేముల పేరు చేరింది. కాకపోతే అంతకు ముందరి నరేంద్ర దభోల్కర్, గోవింద పన్సారే, ఎం ఎం కల్బుర్గి, మహమ్మద్ అఖ్లాక్ లను సంఘ్ పరివార్ శక్తులు ప్రత్యక్షంగా హత్య చేయగా, రోహిత్ వేములది ఆత్మహత్యగా కనిపించే వ్యవస్థీకృత హత్య. కేవలం భిన్నాభిప్రాయాలు ఉన్నందువల్ల ఈ దేశంలో హిందూ బ్రాహ్మణీయ హంతక భావజాలానికీ, దాని ఉగ్రరూపమైన సంఘ్ పరివార్ దాడులకూ బలి అయినవారిలో రోహిత్ వేముల మొదటివారూ కాదు, చివరివారూ కాకపోవచ్చు. కాని ఒక అత్యున్నత విద్యాసంస్థలో పరిశోధక విద్యార్థిగా, విశాలమైన సృజనాత్మక ఆలోచనలు, అద్భుతమైన వ్యక్తీకరణ శక్తి ఉన్న మేధావిగా ఆయన మరణం అత్యంత విచారకరమైనది. ఆయన మరణానికి దారితీసిన పరిస్థితులు, మరణానంతర ప్రజాగ్రహం, ఆ ప్రజాగ్రహాన్ని పక్కదారి పట్టించడానికి సంఘ్ పరివార్ శక్తులు చేస్తున్న తప్పుడు వాదనలు సమాజం తీవ్రంగా పట్టించుకోవలసిన, ఆలోచించవలసిన ఎన్నో మౌలిక అంశాలను లేవనెత్తుతున్నాయి.

ఆత్మహత్యగా కనబడుతున్న రోహిత్ ది నిజానికి వ్యవస్థ చేసిన హత్య అనడానికి అనేక కారణాలున్నాయి. సమాజంలో అసంఖ్యాకుల పట్ల అమలవుతున్న అసమానతలను, అవమానాలను, వివక్షను హిందూ బ్రాహ్మణీయ భావజాలం నిర్దేశిస్తున్నది. అపౌరుషేయమని చెప్పే రుగ్వేదంలోని పురుషసూక్తం, స్వయంగా భగవంతుడి నోటి నుంచి వెలువడినట్టు చెపుతున్న భగవద్గీత, సమాజ ధర్మశాస్త్రంగా వెలువడిన మనుస్మృతి వర్ణాశ్రమ ధర్మాన్ని, అంతరాలను, వివక్షను స్పష్టంగా నిర్దేశించి అసమానతలకు మత ఆమోదాన్ని ప్రకటించాయి. సమాజంలోని అత్యధిక సంఖ్యాకులను విద్యకూ, సామాజిక జీవితానికీ, సంస్కృతికీ, రాజకీయాలకూ, అధికారానికీ దూరం చేయాలని హిందూ ధర్మపు ప్రధాన గ్రంథాలన్నీ ఘోషించాయి. ఆ గ్రంథాల గురించి తెలియకపోయినా, అవి చదవకపోయినా అవి ప్రబోధించే విలువలు సమాజ సంస్కృతిగా మారినందువల్ల ఆ విలువలను పాటించేవారు విస్తృతంగా ఉన్నారు. అసమానతల, నిచ్చెనమెట్ల వ్యవస్థ సహజమైనదనీ, దాన్ని ఆమోదించి, పునరుత్పత్తి చేయడం కన్న మనుషులు చేయగలదేమీ లేదనీ అనుకునే స్థితి వందల సంవత్సరాలుగా కొనసాగుతున్నది. అసమానతలను, వాటికి మూలమైన మత-కుల వ్యవస్థలను ప్రశ్నించిన గొంతులను నులిమేయడం కూడ వందల సంవత్సరాలుగా జరుగుతున్నది. కాలక్రమంలో మతం వ్యక్తిగత విశ్వాసం స్థాయి నుంచి సామూహిక మతోన్మాద హింస స్థాయికి మారింది. రాజ్యమూ మతమూ కలగలిసిన విష కషాయానికి సామ్రాజ్యవాదం రంగులద్దింది.

ఇదీ ఇవాళ భారత సమాజంలో హిందూ బ్రాహ్మణీయ భూస్వామ్య సామ్రాజ్యవాద దళారీ శక్తుల మిలాఖత్తు. ఈ దుర్మార్గ పాలనలో పుట్టుకే ఒక ప్రాణాంతక ప్రమాదం. పుట్టకముందే అత్యధికుల పేర్లు దేశద్రోహుల, మతద్రోహుల, అవమానితుల, బహిష్కృతుల జాబితాలో చేరిపోతున్నాయి. ఇక వారు జీవితాంతం ఆ శిలువ మోస్తూ ఒంటరితనంలో బతకవలసిందే. అలా మత, కుల అసమానతల వ్యవస్థ చేసిన హత్య రోహిత్ ది.

ఆధునిక సమాజంలో కుల అసమానతలు, కుల వివక్ష ఉండగూడదని, మనుషులందరూ సమానమేనని, తరతరాలుగా వివక్షకు, అవకాశాల నిరాకరణకు గురైన సమూహాలకు రక్షణలు కల్పించాలని ఎన్నో ఉద్యమాలు, ఎందరో ఆలోచనాపరుల చర్చల ఫలితంగా విద్యారంగంలో దళితుల ప్రవేశానికి అవకాశం దొరికినప్పటికీ, అప్పటికే విద్యాసంస్థలను ఆక్రమించుకుని కూచున్న అగ్రవర్ణాలు వాటిని అగ్రహారాలుగా మార్చాయి. విద్యాలయాలలో కూడ సామాజిక అసమానతలను, వివక్షను, కుల, మత విద్వేషాలను పెంచి పోషించే సంఘ్ పరివార్ సంస్థలూ పుట్టుకొచ్చాయి. విద్యాసంస్థల యాజమాన్యాలకూ సంఘ పరివార్ సంస్థలకూ మధ్య ఉన్న మిలాఖత్తు ఫలితమే రోహిత్ మీద, మరి నలుగురు దళిత విద్యార్థుల మీద అమలయిన సాంఘిక బహిష్కార శిక్ష. ఆ రకంగా కూడ రోహిత్ ది వ్యవస్థ చేసిన హత్యే.

మన సమాజంలో సమసమాజ ఆలోచనలు, ప్రగతిశీల ఉద్యమాలు, దళిత అనుకూల సంఘాలు ఎన్ని ఉన్నప్పటికీ ఇంకా బహిష్కృత దళిత విద్యార్థులు తమ సమస్యలను ధైర్యంగా, సంఘటితంగా ఎదుర్కునే పరిస్థితి లేకపోవడం, వారు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒంటరితనాన్ని, వెలివాడ లోని స్థితిని అనుభవించవలసి రావడం ప్రగతిశీల ఉద్యమాలన్నీ తమను తాము ప్రశ్నించుకోవలసిన సవాళ్లను ముందుకు తెస్తున్నాయి. సామాజిక అసమానతలకు వ్యతిరేక చైతన్యం అవసరమైన స్థాయిలో ప్రచారం కాలేదని, కుల దురభిప్రాయాలు, కుల వివక్షా ఆలోచనలు ఇంకా బలంగానే ఉన్నాయని, కుల వివక్ష మీద పోరాటం ఇంకా అవసరమైన స్థాయిలో జరగడం లేదని చేదు నిజాలను రోహిత్ హత్య చూపుతున్నది. ఆ రకంగా రోహిత్ హత్య మన సమాజంలో ప్రగతిశీల ఆలోచనల, ఆచరణల లోపాలనూ, వైఫల్యాలనూ ప్రకటిస్తున్నది. అలా కూడ రోహిత్ ది వ్యవస్థ చేసిన హత్యే.

ఈ నేపథ్యంలో కంటికి కనబడుతున్న ప్రత్యక్ష శత్రువులకు, హంతకులకు శిక్షలు పడాలని, రోహిత్ కు న్యాయం జరగాలని ఎలుగెత్తడం ఎంత అవసరమో, ఈ హత్య వెనుక ఉన్న వ్యవస్థాగత కారణాలను అన్వేషించి, వాటిని తొలగించే దిశగా ఆలోచనలనూ ఆచరణలనూ పెంచుకోవడం అంత అవసరం. హిందూత్వ భావజాలపు దుర్మార్గానికీ, కుల వివక్షకూ, సంఘ్ పరివార్ శక్తుల దౌర్జన్యాలకూ, విద్యాసంస్థల యాజమాన్యాల నిరంకుశత్వానికీ, ప్రగతిశీల శక్తులలో ఉన్న అలసత్వానికీ వ్యతిరేకంగా చైతన్యాన్ని సమీకరించడం, పోరాడడం ఇవాళ ఎంత తక్షణ అవసరమో రోహిత్ హత్య చెపుతున్నది. గత రెండు సంవత్సరాలుగా పెచ్చరిల్లిన సంఘ్ పరివార్ హంతక అసహనం మీద కేంద్రీకరిస్తూనే, వ్యవస్థాగత కారణాలన్నిటి మీదా పోరాటం ఎక్కు పెట్టడమే ఇవాళ్టి చారిత్రక కర్తవ్యం.

(వీక్షణం ఫిబ్రవరి 2016 సంపాదకీయం)

Posted in Telugu, Veekshanam | Tagged , | Leave a comment

ఒక కన్నీటి చుక్క, ఒక కొవ్వొత్తి, ఒక ప్రతీకార ప్రకటన సరిపోతాయా? ఎన్ని పాతర్ల లోతు నుంచి మారాలి మనం?!

ఈభూమి జనవరి 2013 సంచిక కోసం

డిసెంబర్ 16 రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అమానుష కృత్యం, ఇరవై మూడేళ్ల యువతిపై ఆమె స్నేహితుడి ముందే బస్సులో జరిగిన సామూహిక అత్యాచారం, ఆమెపై, ఆమె స్నేహితుడిపై దౌర్జన్యం, ఇనుప చువ్వలతో, ఇతర సాధనాలతో ఆమె కడుపు మీద, మర్మావయవాలలో పొడిచిన భయంకరమైన హింస, ఇద్దరినీ విపరీతంగా కొట్టి దాదాపు స్పృహలేని స్థితిలో రోడ్డు పక్కన పడేసి పోవడం, ఆ హింస ఫలితంగా పేగులన్నీ చితికిపోయి, ఎన్నో అవయవాలు దెబ్బతిని, పదమూడు రోజుల చికిత్స తర్వాత ఆ యువతి మరణం… ఈ ఘటనా పరంపర హృదయం ఉన్న వారినెవరినైనా కంట తడి పెట్టించేంత కర్కోటక పరిణామాలు. మనిషిగా స్పందించే వారెవరిలోనైనా నేరస్తుల పట్ల కసి రగిలించే పాశవిక సంఘటనలు. Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | 2 Comments

2012 in review

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

600 people reached the top of Mt. Everest in 2012. This blog got about 6,000 views in 2012. If every person who reached the top of Mt. Everest viewed this blog, it would have taken 10 years to get that many views.

Click here to see the complete report.

Posted in Telugu | Leave a comment

నేపాల్ మావోయిస్టుల దారి ఎటు?

వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం

పది సంవత్సరాల సాయుధ పోరాటంతో దేశవ్యాప్త అధికారానికి చేరువ అయిన నేపాల్ మావోయిస్టుల పట్ల ప్రపంచవ్యాప్తంగానే ఆసక్తి, ఆదరణ వెల్లువెత్తాయి. భారతదేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ కూడ చాల మంది ప్రగతిశీలవాదులు, విప్లవ సానుభూతిపరులు నేపాల్ విప్లవాన్ని సగౌరవంగా ప్రశంసించారు. పదహారు వేలమంది కార్యకర్తలు, ప్రజలు అమరులైనప్పటికీ, వెనుకబడిన దేశాలలో ఇరవై ఒకటో శతాబ్ది విప్లవాలకు ‘ప్రచండ మార్గం’ దారి చూపుతుందని ఆశించారు. నాలుగు దశాబ్దాల సాయుధ పోరాటం తర్వాత కూడ విజయానికి చేరువ కాలేకపోయిన భారత విప్లవోద్యమం నేపాల్ నుంచి నేర్చుకోవలసి ఉంటుందని అన్నారు, అనుకున్నారు. Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | 1 Comment

పాలస్తీనా రక్తాశ్రుసిక్త విషాద గాథ

పాలస్తీనా లోని గాజా నగరం మీద ఇజ్రాయెల్ వైమానిక దళం నవంబర్ 14న జరిపిన దాడిలో గాజాను ప్రస్తుతం పాలిస్తున్న హమస్ సైనిక నాయకుడు అహ్మద్ జబారీ మరణించాడు. అప్పటినుంచి నవంబర్ 21 న ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగేవరకూ వారం రోజుల పాటు ఇజ్రాయెల్ దాడులు, హమస్ ప్రతిదాడులతో గాజా దద్దరిల్లిపోయింది. ఈ వారం రోజుల యుద్ధంలో పాలస్తీనా వైపు మొత్తం మీద 13 మంది స్త్రీలు,  43 మంది పిల్లలతో సహా 173 మంది మరణించారు. 1300 మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ వైపు ఇద్దరు సైనికులతో సహా మొత్తం ఆరుగురు మరణించారు. గాజాలో హమస్ వంటి “తీవ్రవాద” సంస్థలు తమ మీద దాడికోసం ఆయుధాలు పోగు వేస్తున్నాయని, ముందస్తు నిరోధక చర్యగా వారి నిర్దిష్ట లక్ష్యాల మీద దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. కాని మృతుల సంఖ్య చూస్తేనే ఇజ్రాయెల్ భద్రతా దళాలు ఎంత విచ్చలవిడిగా, పౌర, నివాస స్థలాల మీద దాడి జరిపాయో అర్థమవుతుంది.

Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | 1 Comment

ఒబామా గెలుపు ఎవరికి మేలు?

వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం

అమెరికా అధ్యక్షుడుగా బారక్ హుసేన్ ఒబామా మొదటిసారి గెలిచినప్పుడు వీక్షణం 2008 డిసెంబర్ సంచికలో ‘ఒబామా మార్పు తేగలడా?’ అని సంపాదకీయ వ్యాఖ్య రాశారు. ఇప్పుడు ఒబామా రెండోసారి గెలిచిన సందర్భంగా ఆ వ్యాఖ్యను యథాతథంగా గుర్తు తెచ్చుకోవడం అవసరం.

“రెండువందల ముప్పై సంవత్సరాల తర్వాత, నలభైముగ్గురు అధ్యక్షులతర్వాత అమెరికా అధికార పీఠం మీదికి ఆ సమాజంలోని అతి ముఖ్యభాగానికి చెందిన వ్యక్తికి అవకాశం దొరకడం కొత్తగాలి వీస్తున్నదనడానికి సూచనే. అంతమాత్రమే గాక, తెల్లవారికి, నల్లవారికి మధ్య సమానత్వం ఉండాలని అన్నందుకే ఇద్దరు అధ్యక్షులు హత్యకు గురయిన దేశంలో, ఒక నల్లజాతి వ్యక్తి ఎన్నికల ద్వారా అధ్యక్ష పదవికి రావడం కూడ ఆహ్వానించవలసిన సంగతే. అమెరికా సమాజంలో వ్యక్తీకరణ పొందుతున్న కొత్త తరం ఆలోచనలకు, ప్రజాస్వామిక ధోరణులకు ఒబామా ఎన్నిక ఒక సూచనే. Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment

On Telangana March

 

Posted in Videos | Leave a comment

నేరం – శిక్ష – బాల్ ఠాక్రే – అజ్మల్ కసబ్

వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం

ముంబైలో నాలుగు సంవత్సరాల కింద 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు “పాకిస్తాన్-ప్రేరేపిత తీవ్రవాదులు” జరిపిన బాంబు దాడులలో, కాల్పులలో 164 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఆ నేరానికి పాల్పడిన వారిలో సజీవంగా దొరికిన ఒకే ఒక్క వ్యక్తి అజ్మల్ కసబ్ అనే పాకిస్తాన్ పౌరుడు. రెండు సంవత్సరాల విచారణ ప్రక్రియ తర్వాత 2010 మేలో కసబ్ కు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఆ శిక్షను రాష్ట్ర హైకోర్టు, సుప్రీం కోర్టు కూడ నిర్ధారించాయి. చివరి అవకాశంగా పెట్టుకున్నక్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి నవంబర్ 5న నిరాకరించారు. ఆ తర్వాత నవంబర్ 21 ఉదయం కసబ్ ను ఎరవాడ జైలులో ఉరితీశారు. Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment